అమరావతి, 2 జూన్ (హి.స.)
అమరావతి, ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల్లో డ్యూయల్ సర్టిఫికేషన్ విధానానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రతిపాదనకు జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి(ఎన్సీవీఈటీ) అంగీకరించింది. త్వరలో మంత్రి లోకేశ్ సమక్షంలో ఇంటర్ బోర్డు, ఎన్సీవీఈటీ ఒప్పందం చేసుకోనున్నాయి. ఆ వెంటనే నూతన విధానం అమల్లోకి వస్తుంది. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో చేరేవారికి డ్యూయల్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అంటే ఇంటర్ బోర్డు జారీచేసే సర్టిఫికెట్లోనే ఎన్సీవీఈటీ ఆమోదం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకేషనల్ కోర్సులు చదువుతున్నవారు సుమారు 90 వేల మంది ఉన్నారు. వారికి మొదటి నుంచీ రాష్ట్ర ఇంటర్ బోర్డే సర్టిఫికెట్లు జారీచేస్తోంది. కానీ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో బయటి రాష్ర్టాల్లో ఉద్యోగాలకు, రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీల ఉద్యోగాలకు ఎన్సీవీఈటీ సర్టిఫికెట్ అవసరం అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ