మచిలీపట్నం2 జూన్ (హి.స.) ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆదివారం ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజపేటలో చౌకధరల దుకాణం ద్వారా రేషన్ పంపిణీని ప్రారంభించారు. ‘‘రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వైకాపా హయాంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి వేలకోట్ల రూపాయలు దోచేశారు. ఇంటింటి రేషన్ పేరుతో కార్డుదారులనూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇకపై ప్రతి నెలా ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకూ చౌకధరల దుకాణాల్లో రేషన్ అందుబాటులో ఉంటుంది. కార్డుదారుల అభిమతం మేరకు బియ్యం బదులు నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ