తిరుమల , 2 జూన్ (హి.స.)విద్యార్థుల స్కూల్స్ ఓపెనింగ్ తేదీలు దగ్గర పడుతుండటం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గత వారం రోజుల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో తిరుపతి కొండకు చేరుకుంటున్నారు. దీంతో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయినప్పటికి భక్తుల రద్ధీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఆదివారం 78031 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 32936 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే టీటీడీకి భక్తుల(Devotees) కానుకల ద్వారా 3. 46 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే సోమవారం ఉదయం కూడా తిరుమలలో భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతూనే ఉంది. నిన్న వీక్ ఎండ్ కావడంతో పెద్ద ఎత్తున యువత శ్రీవారి దర్శనానికి పొటెత్తారు. దీంతో ఈ రోజు ఉదయం భక్తులతో తిరుమల కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో ఏటీజీ హెచ్ క్యూలైన్ వరకు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మెట్ల మార్గంలో చిరుత కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు.. పోలీస్, అటవీ శాఖ అధికారులతో కలిసి మెట్ల మార్గంలో బందోబస్తును పటిష్టం చేశారు. అలాగే భక్తులకు తగిన సూచనలు చేస్తూ.. ఒంటరిగా కాలినడకన ఎవరూ వెళ్లవద్దని, గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి