నెల్లూరు , 2 జూన్ (హి.స.)
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన లింగసముద్రం మండలంలో చోటు చేసుకుంది. తాతా హోటల్ పక్కన జంపాలవారపాలెంలో టీడీపీ నాయకుడు తోవూరి నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడిచి హత్య చేశాడు.
అంతటితో ఆగకుండా రెండు రోజులుగా నరసింహం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నరసింహం నిమ్మతోట వద్ద బ్రహ్మయ్య కాపలాదారుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి మధ్య ఏ విషయంలో వివాదం జరిగింది, నరసింహంను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
నరసింహం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బోరుబావి వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి