విశాఖపట్నం, 20 జూన్ (హి.స.)రేపు 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( International Yoga Day) పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో యోగా వల్ల కలిగే ప్రయోజనాలు అవగాహన కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ సందర్భంగా తెలిపారు. యోగాంధ్రలో భాగంగా గత నెల 21 నుంచి ఈనెల 21 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శనివారం (జూన్ 21) రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా యోగాసనాలు వేయనున్నారని వివరించారు.
అలాగే, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 22 రికార్డులను బద్దలు కొట్టబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 20, గిన్నిస్ బుక్కు సంబంధించి రెండు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఒకేసారి 2 కోట్ల మందికి పైగా యోగా చేయడం ద్వారా ఒక రికార్డు, ఒకే ప్రదేశంలో 3 లక్షల మంది యోగా చేసి మరో రికార్డు సృష్టించనున్నట్టు వివరించారు. 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లోనే 108 సూర్య నమస్కారాలు చేయించి రికార్డులను బద్దలు కొట్టబోతున్నట్లు సీఎం పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి