తెలంగాణ, తొర్రూరు. 20 జూన్ (హి.స.)
పల్లెల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజకీయాలకు, పార్టీలకతీతంగా గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచనున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి పల్లెల ప్రగతికి బాటలు వేస్తున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు