అమరావతి, 20 జూన్ (హి.స.)మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మద్యం కుంభకోణంపై జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో ఒక్క పైసా కూడా తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్. గతంలో వివేకా హత్య కేసులో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని, మీరు కూడా రావాలని అలిపిరిలో సవాలు విసిరితే జగన్ పారిపోయారు అని గుర్తుచేశారు. చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదని, కానీ తాము విధానాల ప్రకారమే వెళ్తామని, ప్రజలు తమను గెలిపించింది పరిపాలించడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికి తప్పితే కక్షసాధింపులతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి