అమరావతి, 21 జూన్ (హి.స.)ఏడాది ముందుగాను రుతుపవనాలు పలకరించడంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలో వానలు దంచికొట్టాయి. కాగా కొద్ది రోజులుగా వానలు ముఖం చాటేయడంతో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కప్పతల్లి ఆటలాడుతూ వరుణ దేవుడిని కరుణించమని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ