అమరావతి, 22 జూన్ (హి.స.)
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
వృద్ధుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బృందం అక్కడకు వెళ్లి రిషికేష్ జయవంత్ కాంబ్లే, మహమ్మద్ సుల్తాన్ షేక్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులపై దేశవ్యాప్తంగా 38 సైబర్ మోసాలకు సంబంధించి కేసులు నమోదైనట్టు వెల్లడైంది. తెలంగాణలోనూ ఈ ముఠాపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ