అమరావతి, 22 జూన్ (హి.స.): ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
అసలు ఏం జరిగిందంటే.. ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా పెద్ద మద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు అబిడ్స్ లోని బొగ్గులకుంటలో గవర్నమెంట్ పే అకౌంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయి ప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయ, కొడుకుతో నివాసం ఉంటున్నారు. తరచూ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు అవుతున్నాయని స్థానికులు తెలిపారు.
వెంకటేశ్వరరావు.. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో కొడుకు నీటి సంపులో మృతదేహాన్ని గుర్తించాడు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ