తెలంగాణ, మెదక్. 22 జూన్ (హి.స.)
ఓ పసికందును గుర్తు తెలియని
వ్యక్తులు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన నర్సాపూర్ మండల పరిధిలో వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొండాపూర్ అటవీ ప్రాంతంలో నాలుగు నెలల మగ శిశువుని వదిలి వెళ్లారు.
వివరాల్లోకి వెళితే మెదక్ నుండి హైదరాబాద్కు కారులో వెళ్తున్న వాహనదారులు కొండాపూర్ అడవి ప్రాంతంలో ఆగి మూత్రం చేయడానికి రోడ్డు పక్కకు వెళ్లడం జరిగింది. అక్కడ సమీపంలో నుండి శిశువు ఏడుపులు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఓ మగ శిశువు కనబడ్డాడు. వెంటనే వారు 108కు కాల్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని శిశువుని తీసుకొని ప్రభుత్వ ఏరియా దవాఖానాకు చికిత్స నిమిత్తం తరలించారు.
అనంతరం పోలీసులు ఐసీడీఎస్ సిబ్బందికి శిశువును అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు