విశాఖపట్నం, 22 జూన్ (హి.స.) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల మేర 3,03,654 మందితో చేపట్టిన యోగా ప్రదర్శన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 2023లో గుజరాత్లోని సూరత్లో 1.47 లక్షల మందితో యోగా నిర్వహించడమే ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించినట్టయింది. అలాగే, శుక్రవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కింది. ఈ రెండు రికార్డులకు సంబంధించిన పత్రాలను మంత్రి నారా లోకేశ్కు గిన్నిస్ బుక్ ప్రతినిధులు శనివారం ఆర్కే బీచ్రోడ్డులోని యోగా ప్రధాన వేదిక వద్ద అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ