ప్రమాదంలో ‘శ్రీశైలం’.. జలాశయానికి పొంచి ఉన్న ముప్పు
కర్నూలు, 23 జూన్ (హి.స.) : బహుళార్ధ సాధక ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. 2009లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదకు ప్రాజెక్టు దెబ్బతింది. ప్రాజెక్టులో ఏర్పడ్డ ప్లంజ్‌ పూల్‌ (భారీ గొయ్యి) స్పిల్‌ వే పునాది కన్నా లోతుకు విస్తరించింది. ఈ
ప్రమాదంలో ‘శ్రీశైలం’.. జలాశయానికి పొంచి ఉన్న ముప్పు


కర్నూలు, 23 జూన్ (హి.స.) : బహుళార్ధ సాధక ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. 2009లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదకు ప్రాజెక్టు దెబ్బతింది. ప్రాజెక్టులో ఏర్పడ్డ ప్లంజ్‌ పూల్‌ (భారీ గొయ్యి) స్పిల్‌ వే పునాది కన్నా లోతుకు విస్తరించింది. ఈ కోతను నిరోధించే సిలిండర్లు కొన్ని వరదలో కొట్టుకుపోగా మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ క్రమంలో తక్షణం పనులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్లంజ్ పూల్ వద్ద 150 అడుగులకు పైగా భారీ గొయ్యి ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ గత వైసీపీ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించింది. కనీసం కూటమి ప్రభుత్వమైనా తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదం తప్పదని విశ్రాంత ఇంజనీర్, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏపీ-తెలంగాణను అనుసంధానం చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించి దాదాపు 60 ఏళ్లు దాటింది. 1963 జూలై 24 అప్పటి ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆనకట్ట నిర్మాణం జరిగింది. 1977 వరకు యాంత్రిక రహితంగా నిర్మాణం చేపట్టిన, ఆ తర్వాత సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావడంతో మిషనరీలు ఉపయోగించారు. ఆనకట్ట పూర్తైన తర్వాత 1983లో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 306 టీఎంసీలు ఉండగా పెద్ద మొత్తంలో పూడిక చేరడంతో ప్రస్తుతం 215 టీఎంసీలకు పడిపోయింది.

గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, 12 రేడియల్ క్రస్ట్ గేట్లు, రెండు రివర్ స్లూయిస్ గేట్లు ఉన్నాయి. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 7 యూనిట్లు (ఒక్కొక్కటి 110 మెగావాట్ల సామర్థ్యం), ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లు(ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం) విద్యుత్ ఉత్పాదన చేసేలా నిర్మాణం చేశారు. అలాగే స్పిల్‌ వే ఫౌండేషన్‌కు, ఏప్రాన్‌కు నష్టం వాటిల్లకుండా ముందస్తుగా ఏప్రాన్‌ పక్కనే స్టీల్‌ సిలిండర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 1.98 వ్యాసం, 18 మీటర్ల ఎత్తుతో 62 సిలిండర్లలో కాంక్రీట్ నింపి 1985-87 సంవత్సరాల మధ్య వీటిని ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande