అమరావతి, 10 జూలై (హి.స.) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలను లక్ష్యంగా చేసుకుని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్, బాలకృష్ణ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని ఆరోపించిన ఆయన, వారిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్, ఆయన సోదరులు, బాలకృష్ణ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదా? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నందునే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వారిపై విచారణలు ఉండవా? వాళ్ల మీద ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగవా? అంటూ ఆయన నిలదీశారు. బీజేపీతో కలిస్తే పద్మభూషణ్లు ఇచ్చి చాలా శుభ్రంగా కాపాడతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దౌర్జన్యం, అవినీతి పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయని కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి