ముంబై, 11 జూలై (హి.స.)ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్స్కు అలవాటు పడిపోయారు. ఎక్కడ చూసినా.. డిజిటల్ పేమెంట్స్ హవానే నడుస్తుంది. టీ తాగినా, టిఫిన్ చేసినా, పెట్రోల్ కొట్టించుకున్నా, పాల ప్యాకెట్ కొన్నా.. ఏ చిన్న కొనుగోలుకైనా సరే ఫోన్ పేనో, గూగుల్ పేనో ఓపెన్ చేసి స్కాన్ చేసేస్తున్నారు. ఇలా యూపీఐ పేమెంట్స్పై ఎక్కువగా ఆధారపడుతున్న వారు.. అందులోనా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్ ఉండి, ఆ అకౌంట్తో యూపీఐ లింక్ ఉన్నవాళ్లకు మాత్రం ఒక ముఖ్య గమనిక. అదేంటంటే.. ఈ నెల 12న అంటే శనివారం ఆ బ్యాంక్ తమ యూపీఐ సేవలను నిలిపివేయనుంది. తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు యూపీఐ సేవలు ఉపయోగించలేదు.
ఎస్సెంటిల్ సిస్టం మైంటెనెన్స్ కారణంగా ఈ నాలుగు గంటల మధ్య యూపీఐ సేవలు పనిచేయవు. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్ బ్యాంక్ తమ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ఆ టైమ్లో చాలా మంది నిద్రలోనే ఉంటారు. పెద్దగా ఎవరు కూడా ఆ సమయంలో బ్యాంక్ లావాదేవీలు జరుపరు గనుక బ్యాంక్ ఆ సమయంలోనే ఈ మెంటేనెన్స్ చేపట్టింది. గతంలో కూడా ఇలా పలు సందర్భాల్లో కూడా తమ సేవలు నిలిపివేసింది. అయితే.. కొంతమంది ప్రయాణం చేసే వారు, ఆస్పత్రిలో ఉన్న వారు మాత్రం ఎందుకైనా మంచిది ముందుగానే కొంత నగదు డ్రా చేసుకోని తమ వద్ద ఉంచుకోవడం మంచిది. ఆ సమయంలో ఏవైనా అవసరాలు వస్తే.. యూపీఐ సేవలు పనిచేయకుంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి