భువనేశ్వర్, 11 జూలై (హి.స.)
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాద స్ఫూర్తిని తొలగించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భువనేశ్వర్లో శుక్రవారం నిర్వహించిన ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. భాజపా నాయకత్వంలో వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని దుయ్యబట్టారు. తమ హక్కుల కోసం దళితులు, ఆదివాసీలు, యువత ఎలా పోరాడాలో తెలుసుకోవాలన్నారు.
ఒడిశాలోని ప్రభుత్వ అధికారులు, దళితులపై భాజపా మద్దతుదారులు దాడులకు దిగుతున్నారని, ఇది సరికాదని ఖర్గే హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా 160 ప్రభుత్వరంగ సంస్థల్ని ఏర్పాటు చేస్తే.. భాజపా ప్రభుత్వం వాటిలో 23 సంస్థల్ని ప్రైవేటీకరణ చేసిందని మండిపడ్డారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు