ఢిల్లీ, 11 జూలై (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించారు ప్రధాని. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించిన మోదీ.. మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ పర్యటనలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు ఆయన. ఎక్కువ విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో మోదీ ప్రసంగించారు. తాజా పర్యటనలో నమీబియా, ట్రినిడాడ్, ఘానాలో ప్రసంగించారు ప్రధాని మోదీ. నమీబియా పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో మోదీ ప్రసంగించారు. భారత్కు చీతాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో చీతాలు క్షేమంగా ఉన్నాయన్నారు ప్రధాని మోదీ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరఫున మొత్తం ప్రధానులందరూ కలిసి 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోదీనే ఆ సంఖ్యను చేరుకోవడం గమనార్హం. అయితే దీనిపై భాజపా హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నుంచి మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర దేశాలకు వెళ్లడం తప్పిస్తే దేశంలోని సమస్యలను పట్టించుకునే తీరిక మోదీకి లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఐదు దేశాల పర్యటన సందర్భంగా ఘనా, ట్రినిడాడ్-టొబాగో, నమీబియా పార్లమెంట్లలో మోదీ ప్రసంగించడంతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు.
దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పార్లమెంట్లలో ఏడుసార్లు ప్రసంగించారు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు, నెహ్రూ మూడుసార్లు, రాజీవ్ గాంధీ రెండుసార్లు, పీవీ నరసింహారావు ఒకసారి ప్రసంగించారు. మోదీ అమెరికా పార్లమెంటులో రెండుసార్లు మాట్లాడారు. విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించడం ద్వారా మోదీ నాయకత్వానికి ప్రపంచస్థాయిలో గౌరవం దక్కుతోందని భాజపా ట్వీట్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి