శ్రీశైలం, 11 జూలై (హి.స.)ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల డ్యామ్ నుంచి భారీ వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం ఉదయం శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలానికి ఇన్ఫ్లో 1,47,696 క్యూసెక్కులు వస్తుండగా.. మూడు గేట్లు, రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా 1,48,734 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగుల వద్ద కొనసాగుతుంది. దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ (Nagarjuna Sagar Dam)కు వరద కొనసాగుతుండటంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి