తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 17 జూలై (హి.స.)
మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. ఎన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్రెడ్డి ఆలోచన అని, అందుకు ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బస్సులో ఉచిత ప్రయాణం, మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, ఐకేపీ కేంద్రాల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుతో ప్రభుత్వం మహిళలకు ఆలంభనగా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు