అమరావతి, 17 జూలై (హి.స.)
తాడికొండ, రెప్పపాటులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు మహిళలు గాయపడ్డారు. తాడికొండ సీఐ వాసు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ యనమలకుదురు ప్రాంతానికి చెందిన తాడంకి నాగేంద్రబాబు(38), వట్టిచెరుకూరు గ్రామానికి చెందిన నవ్య, లక్ష్మీత్రివేణి, గుంటూరులోని లక్ష్మీపురానికి చెందిన యశోద కృష్ణ, సంగడిగుంటకు చెందిన రజితలు కారులో బుధవారం మధ్యాహ్నం ఓ కార్యక్రమం నిమిత్తం గుంటూరు నుంచి అమరావతి వెళ్తున్నారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామ శివారుకు వచ్చే సరికి అమరావతి నుంచి తుళ్లూరు మండలం పరిమి గ్రామానికి వెళ్తున్న మరో కారు టైర్ పేలడంతో అదుపుతప్పి వీరి కారును వేగంగా ఢీకొంది. ఆ ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న నాగేంద్రబాబు లోపల ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. లోపల ఉన్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. కారులోనే ఇరుక్కుపోయిన మృతదేహాన్ని గ్రామస్థులు అతి కష్టం మీద బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ