హైదరాబాద్, 2 జూలై (హి.స.)
ఏడాదిలో ఏదో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వారు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేట్కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తాం అని, త్వరలో 25 ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. బంజారాహిల్స్లో ఏఐజీ ఆస్పత్రిని సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు.
'ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు. తెలంగాణ, హైదరాబాద్కు నాగేశ్వర్ రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చింది. నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి నా వంతు ప్రయత్నం చేస్తా. 66 దేశాల నుంచి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు రావడం మనకు గర్వకారణం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుంది. హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..