రాయచోటి, 3 జూలై (హి.స.)
: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పలు వివరాలను పోలీసు అధికారులతో కలిసి డీఐజీ వెల్లడించారు. నిందితులిద్దరూ ‘అలూమా’ ఉగ్రవాదులని తెలిపారు. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు.
‘‘రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారిపై విచారణ చేస్తున్నాం. దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఐసిస్, అలూమా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయి. అలూమా దక్షిణ భారత్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. తమిళనాడు పోలీసుల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. రాయచోటిలో నియామకాలు, శిక్షణ ఇచ్చినట్లు విచారణలో నిర్ధరణ కాలేదు. పేలుడు సామగ్రి ఎలా వచ్చిందనేదానిపై విచారణ చేపడుతున్నాం. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 20 ఏళ్లయినా చట్టం నుంచి తప్పించుకోరనడానికి ఇది నిదర్శనం. పేలుడు పదార్థాల గురించి ఉగ్రవాదుల కుటుంబసభ్యులకు తెలుసా? లేదా? అనేది అనుమానాస్పదంగా ఉంది. వారికి తెలిసే చేశారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఉగ్రవాదులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. రాయచోటిలో స్థిరపడిన తర్వాత 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఉంది’’ అని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్లు.. దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ