అనంతపురం, 20 జూలై (హి.స.)
, కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏటా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు చొప్పున అర్థికసాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ‘వనమిత్ర’ యాప్ రూపొందించింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులకు ‘రైతు భరోసా’ సాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో తయారు చేసిన జాబితాను అధికారులు నవీకరిస్తున్నారు. రైతుల పేర్లు సరిచూసుకుని అర్హత బట్టి తిరిగి యాప్లో నమోదు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం.. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. అర్హత ఉండి జాబితాలో లేనివారికి మరో అవకాశం కల్పించారు. మృతులు, ఆదాయపు పన్ను, ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి తొలగించారు. నమోదుకు ఎలాంటి గడువు విధించలేదు. ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం కాని వారు, భూమి కొనుగోలుదారులు, వెబ్ల్యాండ్లో పేరు మారనివారు ఉంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సరి చేసుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ