నెల్లూరు, 20 జూలై (హి.స.)
:దొంగతనాలు, దోపిడీలతో రిస్కు అనుకున్నాడో ఏమో... కాలు కదల్చకుండా దర్జాగా నగదు దోచుకోవడానికి ప్రణాళిక వేశాడో ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మున్సిపల్ కమిషనర్ అవతారం ఎత్తి, పన్ను బకాయిలు చెల్లించాలంటూ వ్యాపారులను బెదిరించి, దోచుకోవడం మొదలుపెట్టాడు. ఈ కేటుగాడిని నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వైఎ్సఆర్ కడప జిల్లా బీ కోడూరు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బిల్లా నాగేశ్వరరావు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారులకు మున్సిపల్ కమిషనర్ పేరిట ఫోన్చేసి వాణిజ్య పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. వారి మొబైల్ ఫోన్లకు తన బ్యాం కు ఖాతా క్యూఆర్ కోడ్ పంపి అందులో డబ్బులు వేయించుకునేవాడు. నెల్లూరుకు చెందిన హైరర్స్ యజమాని రియాజ్ బాషాకు గతనెల 17న నిందితుడు ఫోన్ చేశాడు. వారి సంస్థ పేరుపై రూ.2,100 మున్సిపాలిటీకి బకాయి ఉందని, వెంటనే తాను పంపిన క్యూఆర్ కోడ్ను స్కాన్చేసి నగదు చెల్లించాలని ఆదేశించాడు. ట్రైడ్ లైసెన్స్ చెల్లించామని రియాజ్ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆయన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదు చెల్లించారు. కొద్దిసేపటి తర్వాత నిందితుడు మళ్లీ ఫోన్ చేసి మరో రూ.1,200 చెల్లించాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన రియాజ్ నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై బాధితుడు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నెల్లూరులోని పొదలకూరు రోడ్డు వద్ద నిందితుడు బిల్లా నాగేశ్వరరావును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రోశయ్య చెప్పారు. కాగా, నిందితుడిపై బీ కోడూరు, బద్వేలు, కడప, గుంతకల్, తెలంగాణలోని గద్వాలలో కేసులు నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ