ముంబయి:, 21 జూలై (హి.స.)దాదాపు రెండు దశాబ్దాల క్రితం ముంబయి (Mumbai)లో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు (Bombay HC) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2006లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శిక్ష పడిన 12 మందిని తాజాగా నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పు వెలువరించింది. వీరిలో ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా ఉండటం గమనార్హం. ఆ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వేలైన్లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు (Mumbai Train Blasts) చోటుచేసుకున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ మారణహోమంలో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు.. 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కొవిడ్ కారణంగా నాగ్పుర్ జైల్లో మృతి చెందాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ