సింగరాయకొండ, 21 జూలై (హి.స.)
, కుమార్తెకు మంచి భవిష్యత్తు ఇచ్చానన్న ఆనందం ఆ తండ్రికి కొన్ని గంటల్లోనే ఆవిరైంది. ఆమెను కళాశాలలో జాయిన్ చేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ అర్ధాంగి చేతుల్లోనే కన్ను మూయడం స్థానికులను కలచివేసింది. ఈ సంఘటన ఆదివారం సింగరాయకొండ మండలం కలికివాయ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరుకు చెందిన షేక్ సుభానీ బాషా, ఆఫ్రిన్ దంపతులు. సుభానీ స్థానికంగా దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య ఆఫ్రిన్, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కుమార్తెకు మంచి భవిత ఇవ్వాలని.. : సుభానీ కుమార్తె మంచి ప్రతిభ చాటి తెలంగాణ రాష్ట్రం బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. దీంతో ఆమెను అక్కడ చేర్పించి శనివారం రాత్రి రైల్లో దంపతులిద్దరూ తిరుగుపయనమయ్యారు. ఆదివారం ఒంగోలులో దిగి ద్విచక్ర వాహనంపై పలుకూరుకు వస్తూ కలికివాయ సమీపంలో ఆగివున్న లారీని ఢీకొని రోడ్డుపై పడిపోయారు. భర్త తలకు తీవ్ర గాయమై రక్తమోడుతుండటంతో భార్య ఆఫ్రిన్ సపర్యలు చేస్తున్నారు. వెంటనే అక్కడున్న ప్రయాణికులు స్పందించి 108 వాహనంలో వారిని ఒంగోలుకు తరలిస్తుండగా, భార్య ఒడిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు సుభానీ తాపత్రయపడేవారని, రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందడంతో తమకు దిక్కెవరని భార్య కన్నీరుమున్నీరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ