తిరుమల, 21 జూలై (హి.స.) ప్రవాసాంధ్రులకు సులభంగా శ్రీవారి దర్శనం లభించనుంది. ఇకపై ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను సూచించారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి 10కి తగ్గించారు. ఈ విషయాన్ని ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శన కోటా తగ్గడం వల్ల విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కోటాను 10 నుంచి 100కి పెంచారు. ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.
ప్రవాసాంధ్రులు ముందుగా ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ https://apnrts.ap.gov.in/ లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం. ఇందుకోసం తాము ఉంటున్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్ల వివరాలు నమోదు చేయాలి. వెబ్సైట్ లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన మూడు నెలల స్లాట్లు కనిపిస్తాయి. అందులో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ రోజు పరిస్థితులను బట్టి టీటీడీ అధికారులు టికెట్లను కేటాయిస్తారు. టికెట్లు కేటాయింపులు అయిన వారికి ఏపీఎన్ఆర్టీఎస్కు చెందిన పీఆర్ఓ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. వివరాలకు ప్రవాసాంధ్రుల వైబ్సైట్ ద్వారాగానీ, ఏపీలోని తాడేపల్లి, ఏపీఎన్ఆర్టీ సొసైటీ జంక్షన్ ఫోన్ నంబర్ 0863 2340678లో గానీ సంప్రదించవచ్చని సంస్థ ప్రతినిధి వెంకట్రెడ్డి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి