అమరావతి, 22 జూలై (హి.స.):రాష్ట్రంలో కొత్త న్యాయ కళాశాలల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన సొసైటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 8 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, సెప్టెంబరులో తనిఖీలు నిర్వహించి, అదే నెల 29న అనుమతుల ఉత్తర్వులు జారీచేస్తారని వివరించింది. కాలేజీల ఏర్పాటుకు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో వెయ్యి మంది వరకు విద్యార్థులకు అయితే ఒక ఎకరం, వెయ్యి దాటితే రెండు ఎకరాలు ఉండాలని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో అయితే వెయ్యి మంది లోపు విద్యార్థులకు రెండు ఎకరాలు, వెయ్యి మంది దాటితే నాలుగు ఎకరాలు ఉండాలని పేర్కొంది. తరగతి గదులు, మూట్ కోర్ట్ హాల్, టీచర్స్ రూమ్, లైబ్రరీ ఇలా 13 కేటగిరీల్లో ఎంత స్థలం ఉండాలనేది వివరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ