న్యూఢిల్లీ, 26 జూలై (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా ఆయన నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోదీ మొదటిస్థానంలో నిలిచారు. దాదాపు 75 శాతం మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోదీ ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
ఈ విషయాన్ని బీజేపీ నేత అమిత్ మాలవీయ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు. కోట్లకు పైగా భారతీయులచే ప్రేమించబడ్డ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిచే గౌరవించబడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రేటింగ్ పొందిన, అత్యంత విశ్వసనీయ నాయకుడు. బలమైన నాయకత్వం, ప్రపంచ గౌరవం, భారత్ సురక్షితమైన చేతుల్లో ఉంది అని ఆయన రాసుకొచ్చారు.
ఇక, ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన లీ జే-మ్యుంగ్ 59 శాతం మంది మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే (57 శాతం), కెనడా ప్రధాని మార్క్ కార్నీ (56 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి