హైదరాబాద్, 8 జూలై (హి.స.)
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలకు దిగారు.
కూల్చివేతల ప్రక్రియ మొదలైన వెంటనే స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అడ్డుకుంటూ కొందరు మహిళలు నేరుగా వాహనాల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రభుత్వంగా జారీ అయిన పట్టాలు ఉన్నాయని, ఆ భూముల్లో తామే అసలు యజమానులమని బాధితులు వాదించారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం, సర్వే నంబర్ 16లో ఉన్న భూమి పార్కు కు కేటాయించబడిందని, అందులో ప్రహరీ నిర్మాణం అక్రమమని పేర్కొన్నారు. వాస్తవిక పరిశీలన అనంతరం ఆ నిర్మాణాన్ని కూల్చేశారు.
వివాదాస్పద పరిస్థితుల దృష్ట్యా, పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..