కడలూరు, 8 జూలై (హి.స.)తమిళనాడులోని కడలూరులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మగుంపం వద్ద స్కూల్ వ్యాన్ రైల్వే గేట్ క్రాస్ అవుతుండగా.. వేగంగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టింది. దీంతో బస్సు ఎగిరి 10మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మరణించగా.. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో నలుగురు విద్యార్థులతో పాటు, డ్రైవర్, అసిస్టెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వస్తారనుకున్న బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రైలు వచ్చే సమయంలో గేట్ వేయకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి వ్యాన్ మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి