తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 1 ఆగస్టు (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కిన్నెరసాని వాగు సమీపంలో శుక్రవారం గుడుంబా తయారి స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీసులు జంగారెడ్డిగూడెం, ఏలూరు మండలాల అబ్కారీ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో పానకం డ్రమ్ములు, సారా తయారీ సామాగ్రి ధ్వంసం చేశారు. రైతుల పంట పొలాలు ఆంధ్రా సరిహద్దుల్లో గుడుంబా తయారీ, సరఫరాపై నిఘా ఉంటుందని, తరచూ దాడులు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో కుక్కునూరు పోలీస్ సీఐ రమేష్ బాబు, జంగారెడ్డిగూడెం అబ్కారీ శాఖ సీఐ శ్రీనుబాబు, ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్యామ్ భోగేశ్వర్, పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు