హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో మోడరేట్ వర్షాలు కురుస్తున్నాయని, సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిందని నగర ప్రజలు గమనించాలని ఆయన తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని చెప్పారు. నగరంలో వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్ గా ఉన్నామని, ఉద్యోగుల సెలవులు రద్దు చేశామన్నారు. ఉన్నత అధికారులను హెడ్ క్వార్టర్ లో ఉండాలని ఆదేశించామని, రిలీఫ్ కార్యకలాపాలను డిప్యూటీ కమిషనర్, స్థానిక తహసీల్దార్లు చూసుకుంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ కి అప్లికేషన్, కంట్రోల్ రూమ్, మీడియా ద్వారా వచ్చే ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నామన్నారు. మ్యాన్ హోల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని సూచించారు. మ్యాన్ హోల్ పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్కు విభాగాల అధికారులు, ప్రజలు తెలియజేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్