అమరావతి, 14 ఆగస్టు (హి.స.)
: అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పంట్లు, నాటు పడవలపై నదిలో ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ