అమరావతి, 14 ఆగస్టు (హి.స.)
అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైకాపా దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైకాపా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్ అంశంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. పులివెందులలో తెదేపా అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైకాపా అభ్యర్థి హేమంత్రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైకాపాకు 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ