దిల్లీ: 15 ఆగస్టు (హి.స.)దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజధాని దిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై స్నైపర్లు సహా 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో 3 వేల మంది ట్రాఫిక్ పోలీసులను నియోగించారు. మహానగరం యావత్తు కెమెరా నిఘాను పటిష్ఠం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు, సైన్యం, అనుబంధ సైన్యానికి చెందిన సిబ్బంది బహుళ అంచెల్లో దేశరాజధానిలో పహరా కాస్తున్నారు.
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల నుంచే దిల్లీలోకి వాణిజ్య వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్సు టెర్మినళ్లు, విమానాశ్రయాలు, మెట్రోస్టేషన్ల వద్ద ప్రత్యేక దళాలను మోహరించారు. ప్రయాణికుల తనిఖీలను ముమ్మరం చేశారు. జలశుద్ధి ప్లాంట్ల వద్ద భద్రతను పెంచారు. ముఖ్యంగా దేశ రాజధానిలోని ఉత్తర, మధ్య జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రోన్ నిరోధక వ్యవస్థను పర్యవేక్షించేందుకు దిల్లీ పోలీసు కమిషనర్ డీసీపీ ర్యాంకు అధికారిని నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ