తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 16 ఆగస్టు (హి.స.)
'పదవులు మీకే.. పైసలూ మీకేనా' అంటూ సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు.. తన నియోజకవర్గ అభివృద్ధికి అయినా డబ్బులు ఇవ్వండి అని సీఎంను రాజగోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సర్దార్ వల్లభ్బయి పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విగ్రహా ఆవిష్కరణ అనంతరం సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
'వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ఇస్తే వస్తుంది. అందుకే సీఎంనే నేరుగా అడుగుతున్నా. సీఎం, కాంగ్రెస్ పార్టీని నేను విమర్శించడం లేదు. నా నియోజకవర్గంకు రావాల్సిన నిధులు అడుగుతున్నా. 20 నెలల నుంచి నా నియోజకవర్గంలో రోడ్లకు, బిల్డింగులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నేనే స్వయంగా మంత్రి దగ్గరకు వెళ్లి అడిగినా బిల్లులు రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు