తెనాలి, 17 ఆగస్టు (హి.స.)కూలి పనులు చేసుకుంటేనేగానీ రోజు గడవని పేద కుటుంబం వారిది. అయినా వారు చూపిన మానవత్వం ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం సోమసుందరపాలేనికి చెందిన కంచర్ల సుబ్బరాజు (60), కంచర్ల వెంకటలక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూనే సుబ్బరాజు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. సొంత స్థలం, ఉండటానికి ఇల్లు కూడా లేదు. వయసు పైబడటంతో గ్రామంలో తోపుడుబండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. పక్షవాతంతో ఇటీవల సుబ్బరాజు మంచం పట్టారు. ఈనెల 10న గుంటూరులోని రమేశ్ హాస్పటల్ను సంప్రదించగా.. అక్కడి వైద్యులు సుబ్బరాజుకు బ్రెయిన్ డెడ్ అని ధ్రువీకరించారు. అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. పెద్దదిక్కును కోల్పోయిన బాధలో ఉన్న భార్య, పిల్లలు మరికొందరి ప్రాణాలు నిలబడతాయనే సదుద్దేశంతో అవయవదానానికి అంగీకరించారు. దీంతో సుబ్బరాజు ఊపిరితిత్తులను చెన్నైలోని రెండు ప్రాంతాలకు, కిడ్నీల్లో ఒకటి రమేశ్ ఆస్పత్రికి, మరొకటి ఎయిమ్స్కు, కాలేయాన్ని రమేశ్ ఆస్పత్రికి, కళ్లు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురికి పునర్జీవితాన్ని అందించేలా ముందుకు వచ్చిన సుబ్బరాజు కుటుంబానికి కేంద్రసహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలువురు మానవతావాదులు అభినందించారు. సుబ్బరాజు మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహానికి ఎమ్మెల్సీ ఆలపాటి నివాళులు అర్పించారు. అవయవదానంతో సుబ్బరాజు చిరంజీవిగా నిలిచారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ