ఒంగోలు, 2 ఆగస్టు (హి.స.):సీఎం చంద్రబాబు శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకానికి దర్శి నియోజకవర్గం తూర్పువీరాయపాలెం గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో తొలి విడత రూ.7 వేలను శనివారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ పథకం కింద 2,68,165 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. శనివారం ఉదయం 10.35 గంటలకు దర్శి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి తూర్పువీరాయపాలెం చేరుకుని రైతుల సమావేశంలో పాల్గొంటారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సమావేశం ఏర్పాట్లను మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ