హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)
బనకచర్ల ప్రాజెక్టు పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేయబోతున్నాయని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్ను కేటీఆర్ ఎందుకు సీక్రెట్గా కలిశారో తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుందని కేటీఆర్ బలంగా వాదిస్తున్నారు.. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. వృథా జలాల కోసమే బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని నారా లోకేష్ అటున్నారు. అది కూడా కేటీఆర్తో రహస్య సమావేశం వార్త బయటకు వచ్చిన తర్వాతే అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పాలని అడిగారు. బనకచర్లపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే జలాలు వృథాగా పోతున్నాయని చెప్పారు. వరద జలాల్లో నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందని గుర్తుచేశారు. బనకచర్ల విషయంలో తమ స్టాండ్ ఏంటో కేంద్రానికి స్పష్టంగా చెప్పాం.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బనకచర్లను ఆపారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్