అమరావతి, 2 ఆగస్టు (హి.స.)వివిధ సమస్యలపై దశలవారీగా నిరసనలు చేపట్టేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల జేఏసీ పిలుపునిచ్చింది. ఈనెల 7న నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, 11వ తేదీ నుంచి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, 18న విజయవాడలోని ధర్నాకు హాజరుకావాలని లెక్చరర్లను కోరింది. ‘ఎన్నిసార్లు అడిగినా డిగ్రీ అధ్యాపకుల బదిలీలు చేపట్టడంలేదు. గతంలో ఎయిడెడ్ కాలేజీలకు గ్రాంట్ నిలిపివేసినప్పుడు జీవో 42 తీసుకొచ్చిన ప్రభుత్వ లెక్చరర్ పోస్టుల్లో ఎయిడెడ్ లెక్చరర్లను నియమించింది. అనంతరం ఎయిడెడ్ కాలేజీలకు గ్రాంట్ పునరుద్ధరించినా వారిని అక్కడే కొనసాగిస్తోంది. దీనిపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదు’ అని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 26 రాష్రా ్టల్లో డిగ్రీ అధ్యాపకులను అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా మార్చారని, ఏపీలో ఇప్పటికీ అధ్యాపకులుగానే కొనసాగిస్తున్నారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ