కర్నూలు3 ఆగస్టు (హి.స.):కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అంశం కలకలం రేపింది. తమను మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని, వినాయక చందాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని మొదటి సంవత్సరం విద్యార్థులు నేషన్ మెడికల్ కమిషన్, కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కాలేజీ మెన్స్ హాస్టల్లో సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
అలాగే, ర్యాగింగ్ ఆరోపణలపై వైస్ ప్రిన్సిపాల్ సాయిసుధీర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కె.చిట్టినరసమ్మ విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ శుక్ర, శనివారాల్లో విచారణ చేపట్టి సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చింది. జూనియర్లను ర్యాగింగ్ పేరిట వేధించి, భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని హెచ్చరించింది. కాగా, కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదని, విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థులెవ్వరూ చెప్పలేదని తెలిపారు. చందాలు అడిగిన విషయమై స్పందిస్తూ, ఇది.. హాస్టల్లో ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు స్వచ్ఛందంగా జరుపుకునే ఉత్సవాలకు సంబంధించిన అంశమని, ర్యాగింగ్ కిందకు రాదని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ