అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అలాగే కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బుధవారం, గురువారం రోజుల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది. శుక్రవారం నాడు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తీర ప్రాంతాల్లో గురువారం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి