అనంతపురంలో టీమ్ ఎన్డీఏ తొలిసభకు ఏర్పాట్లు పూర్తి
ఈ రోజు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ ఏర్పాట్లు పూర్తి
అనంతపురంలో టీమ్ ఎన్డీఏ తొలిసభకు ఏర్పాట్లు పూర్తి


అనంతపురం, 10 సెప్టెంబర్ (హి.స.)

15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తొలిసారి రాష్ట్రంలోని మూడు ఎన్డీఏ పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. అనంతపురంలో 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ తదితరులు హాజరు కానున్నారు.

ఈ రోజు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి రాజకీయ సభ కావటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై ఈ సభలో ప్రధానంగా మూడు పార్టీల నేతలు ప్రస్తావించనున్నారు.

ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టు ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించనుంది.

కూటమి సర్కారు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ తో వేదికను తీర్చిదిద్దారు. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసీనులయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహిస్తున్న 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట జెండాలను, హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు.

ఇక వేదిక ప్రాంగణానికి దారితీసే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ, లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరుల ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అనంతపురంలోని ప్రధాన కూడళ్లతో పాటు దారి పొడవునా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన జెండాలు, తోరణాలతో సభకు వచ్చేవారిని ఆహ్వానించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande