అనంతపురం, 10 సెప్టెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ చిరునామా అని, వైఎస్ జగన్ పాలన మాత్రం అరాచక పాలనగా నిలిచిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురంలో ఈ రోజు బుధవారం నిర్వహించనున్న ‘సూపర్సిక్స్–సూపర్హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడారు.
అరాచకం, విధ్వంసానికి జగన్ చిరునామా. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు చిరునామా. రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. ప్రజలు తిరిగి తెలుగుదేశం వైపే చూస్తున్నారు, అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీకి రాయలసీమతో ఉన్న చారిత్రిక సంబంధాలను ఆయన ప్రస్తావించారు. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు, బాలకృష్ణ లాంటి నేతలు రాయలసీమకు ప్రాతినిధ్యం వహించారు. ఇది టీడీపీకి బలమైన స్థానం. ఈ సభ ద్వారా రాయలసీమపై పట్టును మరింత బలపరచనున్నాం, అని పయ్యావుల తెలిపారు.
అనంతపురంలో ఈ రోజు జరగనున్న సభకు ప్రజలు భారీగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి