హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ మాట్లాడారు.
జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని ఆదేశించారు. అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల వివరాలను ఉన్నతాధికారులకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..