తెలంగాణ, మెదక్. 26 సెప్టెంబర్ (హి.స.)
కొండపోచమ్మ సాగర్లో నీటి మట్టం
అధికంగా ఉండటంతో, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రాజెక్టు ప్రాంగణంలోకి ఎవరు కూడా ప్రవేశించరాదని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ప్రకటించారు. వారు శుక్రవారం ప్రాజెక్టు వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్యామ్ ప్రాంగణంలోకి ప్రవేశం, నీటిలోకి దిగడం, చేపల వేట చేయడం పూర్తిగా నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. భద్రతా చర్యల భాగంగా హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు, స్టాపర్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఏసీపీ నర్సింహులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ.. పిల్లలను ఒంటరిగా లేదా స్నేహితులతో కలిసి ఈతకు పంపవద్దని సూచించారు. పండుగలు, సెలవు దినాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు