ముంబై, 5 సెప్టెంబర్ (హి.స.)గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్కు వాట్సాప్ హెల్ప్లైన్కు బెదిరింపు వచ్చింది. ఒక కోటి మంది ప్రజలను చంపబోతున్నట్లు సందేశం వచ్చింది. దీంతో పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుని అప్రమత్తమైంది.
ముంబైలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని.. 400 కిలోల ఆర్డీఎక్స్ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్గా ఉన్నట్లు అధికారి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు