న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.) సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే మార్గాలకు భారత్ (India) మద్దతిస్తుందని ఐక్యరాజ్యసమితి (United Nations)లోని శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ (Ukraine) పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతోందని హరీశ్ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం సరి కాదన్నారు. యుద్ధ భూమిలో సమస్యలకు పరిష్కారాలు లభించవని ఉద్ఘాటించారు. సంఘర్షణను ఆపేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాల్లోనే యుద్ధం ముగుస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఇటీవల ఆ దిశగా జరిగిన పలు ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ల మధ్య ఇటీవల అలాస్కా వేదికగా జరిగిన సమావేశాన్ని కూడా హరీశ్ ప్రస్తావించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ