, విశాఖపట్నం, 6 సెప్టెంబర్ (హి.స.): బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదిలే అవకాశముందని, దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మరోవైపు రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.
శుక్రవారం అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత పెరిగింది. కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం, బాపట్ల, కావలి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాబోయే బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది.
మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా రాజస్థాన్, గుజరాత్ వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ